ఒక పిసినారి కథ - The story of a Pisinari - Telugu moral stories
ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాలని ఆ తోటలో రాళ్ళకింద గుంత లో దాచి, దాని పైన రాళ్లు పెట్టేవాడు. కానీ ప్రతి రోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యం గా ఆ బంగారు నాణాలని లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు.
ఒక రోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యం గా గమనిస్తున్న ఒక దొంగ, రోజు లాగే, బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచేవరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి, అతను లోపలికి వెళ్ళాక , గప్చిప్ గా నాణాలని దొంగిలించాడు. మర్నాడు ముసలి వాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.
ఇంటిపక్కవాళ్ళు వొచ్చి, ఏమి జరిగిందని అడిగి, తెలుసుకున్నారు. “ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు. నువ్వేమిటి బైట, అదికూడా భూమిలో పెట్టుకున్నావు? దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలుకాదు కదా?” అన్నారు.
దానికి ఆ పిసినారి, “కొనుక్కోడామా? నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను. అది దాచుకోడానికి మాత్రమే,” అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంట లోకి విసిరి, “అలా అయితే, అదే నీ సొమ్మనుకో. నువ్వు వాడనప్పుడు దానికి విలువేదీ? రాయైనా, బంగారమైన ఒకటేగా. నువ్వు వాడనప్పుడు రెండు విలువ లేనివే,” అంటూ వెళ్ళిపోయాడు.
నీతి : ఉపయోగించని సొమ్ము ఉన్నా, లేకున్నా ఒకటే.