చింతచిగురు రొయ్యల కూర:
కావలసిన వస్తువులు :
చింత చిగురు- కప్పు
కాస్త పెద్ద రొయ్యలు- పావుకిలో
ధనియాల పొడి- చెంచా
జీలకర్రపొడి- అరచెంచా
ఉల్లిపాయ- ఒకటి
కొత్తిమీర- కట్ట
వెల్లుల్లి రేకలు- ఐదారు
నూనె- మూడు టేబుల్స్పూన్లు
గసగసాల పొడి - చెంచా
దాల్చిన చెక్కపొడి - అరచెంచా
అల్లంవెల్లులి పేస్టు- చెంచా
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి- ఐదు
కారం - చెంచా.
తయారు చేసే విధానం :
ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చీ వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి. పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మరికాస్త సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతచిగురుని అరచేతుల్లో వేసి బాగా నలిపితే పొడిలా తయారవుతుంది. దీన్ని రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి. తర్వాత ఉప్పూ, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కాసిని నీళ్లు పోసి మూతపెట్టేయాలి. ఇందులో ప్రత్యేకించి మసాలా వేయాల్సిన అవసరం లేదు. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి, కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.