కొరమీను కూర:

చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ కొరమీను పులుసు పెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.


కావలసిన వస్తువులు :

కొరమీను చేపలు – 1 కిలో

ఉల్లిపాయలు – 2 కప్పులు తరిగినవి

పసుపు – చిటికెడు

ఉప్పు – తగినంత

నూనె – కావలసినంత

కారం – రుచికి సరిపడా

అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – తగినంత

పచ్చిమిరపకాయలు – 3

ధనియాల పొడి – 1/4 టీ స్పూను

గరం మసాలా – 1/4 టీ స్పూను

కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు


తయారు చేసే విధానం :

కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి. చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.